రంగారెడ్డి : జిల్లాలోని కందుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ‘మన ఊరు మన బడి’ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న పనులను పరిశీలించారు. తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు.
ఇంగ్లీష్ తెలుగు భాషల్లో ముద్రించిన పాఠ్యపుస్తకాలు బాగున్నాయని ఈ సందర్భంగా విద్యార్థులు మంత్రికి తెలిపారు. మధ్యాహ్నం భోజనం వండుతున్న విధానాన్ని ఆమె పరిశీలించారు. శుభ్రమైన వాతావరణంలో వంట చేసి విద్యార్థులకు వడ్డించాలని మంత్రి సిబ్బందిని ఆదేశించారు.
పాఠశాలలో అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ‘మన ఊరు మన బడి’ కార్యక్రమాన్ని రూ.7 వేల కోట్లతో ప్రభుత్వ బడుల బలోపేతానికి కృషి చేస్తున్నారని తెలిపారు. నేడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయని మంత్రి పేర్కొన్నారు.