హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): పేదలకు మేలు చేస్తామని, ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రగల్బాలు పలికిన ప్రధాని మోదీ తరచూ గ్యాస్ ధర పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం తీరుతో గ్యాస్ సిలిండర్ ముట్టుకోవాలంటే భయం వేసేలా మారిందని అన్నారు. బీజేపీ అంటే జేబులు ఖాళీ చేసే పార్టీయా? గ్యాస్ ధర పెంపు మోదీ సర్కారు ఇస్తున్న మహిళా దినోత్సవ కానుకా? అని ఆమె ప్రశ్నించారు. వంటింటి గ్యాస్ ధరల పెంపుపై మహిళా లోకం నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. బుధవారం బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు.
దేశానికి మోదీ పాలన గుదిబండలా తయారైందని, బీజేపీ సర్కారుకు చరమగీతం పాడటానికి మహిళలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. మోదీ దేవుడంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. గ్యాస్ ధరలు పెంచినందుకు దేవుడా అని ప్రశ్నించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేషన్ షాపుల్లో మోదీ బొమ్మ పెట్టలేదని అడిగారని, ఇప్పుడు ప్రతి గ్యాస్ సిలిండర్పై మోదీ బొమ్మ పెట్టాలని, బీజేపీ చెప్పే అచ్చే దిన్ ఇదేనా? అని ఎద్దేవా చేశారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ధరలను పెంచడం ఆనవాయితీగా మారిందని, దేశంలో అదానీ, అంబానీలే కాదు ఆమ్ ఆద్మీలు కూడా ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.
చాయ్ అమ్మిన మోదీకి పేదలు ఎలా బతుకుతారో తెల్వదా? అని ప్రశ్నించారు. చాయ్ అమ్మినంత సులువుగా దేశ సంపదను అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఏ వర్గం సంతోషంగా లేదని, క్రూడాయిల్ తగ్గితే ధరలు తగ్గించడం లేదని, మూడు రాష్ర్టాల ఎన్నికలు ముగియగానే గ్యాస్ ధరలు పెంచారని పేర్కొన్నారు. పెరిగిన ధరలకు హద్దు లేదు.. బీజేపీకి బుద్ధి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీకి దేశ సంపదను దోచుకొని ముంచుడు బాగా తెలిసిన విద్య అని, బీజేపీని ముంచడం దగ్గరలోనే ఉన్నదని స్పష్టం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు ఇంతలా పెరిగిన చరిత్ర ఏనాడూ లేదని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి అన్నారు.
సాత్విక్ ఆత్మహత్య బాధాకరం
ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య బాధాకరమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఈ ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. పరీక్షల సందర్భంగా విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా అన్ని కళాశాలలు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సూచించామని మంత్రి తెలిపారు.