హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 20న నిర్వహించే విద్యా దినోత్సవం నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారంగా రాగిజావ అందించనున్నట్టు విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం విద్యాశాఖ పనితీరు, విద్యా దినోత్సవంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతిరోజూ ప్రార్థనా సమయానికి ముందే ప్రతి విద్యార్థికి 250 మిల్లీలీటర్ల రాగిజావ అందిస్తామని తెలిపారు. దీనివల్ల 28,606 ప్రభుత్వ పాఠశాలల్లోని 25,26,907 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.
ఒకటి నుంచి ఐదో తరగతి చదువుతున్న 16,27,457 మంది విద్యార్థులకు మూడేసి చొప్పున వర్బుక్స్, ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న 12,39,415 మంది విద్యార్థులకు సబ్జెక్టుకు ఒకో నోటు పుస్తకం చొప్పున అందిస్తామన్నారు. 1,600 పాఠశాలల్లో నిర్మించిన 4,800 డిజిటల్ తరగతులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 30 లక్ష ల మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందిచనున్నట్టు పేర్కొన్నారు. 26 లక్షల మం ది విద్యార్థులకు రెండేసి జతల యూనిఫామ్ను అందిస్తామన్నారు. సమావేశంలో వి ద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన పాల్గొన్నారు.