Tenth Exams | హైదరాబాద్ : పదో తరగతి పరీక్షల ప్రశ్నపత్రాలు బయటకు రావడంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి( Minister Sabitha Indra Reddy ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు, ఎస్పీలతో బీఆర్కే భవన్( BRK Bhavan ) నుంచి మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్బంగా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో కట్టుదిట్టమైన చర్యలను చేపట్టిందని, ఈ పరీక్షల విషయంలో తమ స్వార్ధ ప్రయోజనాలకై విద్యార్థుల భవిష్యత్తో ఆడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇంకా మిగిలిన నాలుగు పరీక్షల నిర్వహణ విషయంలో మరింత కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు. ఈ పరీక్షల నిర్వహణలో దాదాపు 55 వేల మంది అధికారులు, సిబ్బంది ప్రత్యక్షంగా పాల్గొంటున్నారని తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లోనూ సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించవద్దని, పరీక్షల విధి నిర్వహణలో ఉన్న అధికారులు, సిబ్బందికి కూడా ఈ నిబంధన వర్తిస్తుందని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.
పది పరీక్షల నిర్వహణలో ఉద్యోగులు అక్రమాలకు పాల్పడితే ఉద్యోగాలు పోతాయని, అలాంటి వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి హెచ్చరించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణను ప్రతిపక్షాలు రాజకీయం చేయడం తగదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
పరీక్షల నిర్వహణ అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, ఈ విషయంలో ఏ విధమైన అపోహలకు, అనుమానాలకు తావు లేదని పేర్కొన్నారు. పరీక్షా పేపర్ల రవాణా విషయంలో మరింత భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ను పటిష్టంగా అమలు చేయడంతోపాటు జిరాక్స్ షాప్ లను మూసివేయించాలని సూచించారు. ఇంటర్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించడంలో కృషి చేసిన అధికారులను మంత్రి అభినందించారు.