హైదరాబాద్ : కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యార్థుల తల్లిదండ్రుల మనోభావాలకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. సోమవారం విద్యా శాఖ అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి పాల్గొని మాట్లాడారు. సెప్టెంబర్ 1వ తేదీ నుండి రాష్ట్రంలో విద్యా సంస్థలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు తప్పనిసరిగా అమలు చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.
కొవిడ్ నిబంధనల అమలులో అలసత్వం చూపరాదని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ, శానిటైజేషన్ పూర్తి చేసేందుకు మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖల సహకారాన్ని తీసుకుని శుభ్రం చేయాలని కోరారు. కోవిడ్కు సంబంధించి ఎలాంటి ఆందోళన పెట్టుకోకుండా, చిన్నారులు పాఠశాలలకు హాజరయ్యేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారిని మానసికంగా సిద్ధం చేయాలని కోరారు. తరగతులు నిర్వహిస్తున్న సమయంలో విద్యార్థులు తప్పనిసరి గా మాస్కులు ధరించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
విద్యార్థుల్లో ఎవరికైనా జ్వర సూచన ఉంటే ఆయా స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్స్ వెంటనే సమీపంలోని పీహెచ్సీకి తీసుకువెళ్లి కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఒకవేళ కోవిడ్ నిర్దారణ అయితే విద్యార్థులను తల్లిదండ్రులకు అప్పగించాలని కోరారు. హాజరయ్యే విద్యార్థులు శానిటైజేషన్ చేసుకోవడం, మాస్కులను విధిగా ధరించడం వంటి కోవిడ్ నియంత్రణ చర్యలను పాటించాలని కోరారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన తదితరులు పాల్గొన్నారు.