మయామి గార్డెన్స్: సుమారు ఐదు వారాలుగా సాకర్ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న ఫిఫా వరల్డ్ కప్ చివరి అంకానికి చేరుకుంది. 48 జట్లు తలపడిన ఈ టోర్నీలో స్పెయిన్, అర్జెంటీనా టైటిల్ పోరుకు సిద్ధమవగా అంతకంటే ముందు మూడో స్థానం కోసం ప్రపంచకప్లో నిలకడగా రాణించిన ఫ్రాన్స్, ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఆదివారం తెల్లవారుజామున మయామి గార్డెన్స్ వేదికగా ఈ రెండు జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. గ్రూప్, నాకౌట్ దశల్లో అప్రతిహత విజయాలతో సెమీస్ చేరి వరుసగా మూడోసారి ఫైనల్కు వెళ్లాలన్న ఫ్రాన్స్కు స్పెయిన్ షాకివ్వగా అదే జోష్లో సెమీఫైనల్స్కు వచ్చిన ఇంగ్లండ్కు అర్జెంటీనా చెక్ పెట్టింది.
టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉన్నా సెమీస్ మెట్టుపై తడబడ్డ ఈ జట్లు ఈ పోరులో గెలిచి మూడో స్థానంతో టోర్నీని ముగించాలని ఆశిస్తున్నాయి. ఫ్రాన్స్ సారథి కిలియన్ ఎంబాపె (8 గోల్స్)కు గోల్డెన్ బూట్ రేసులో మెస్సీకి పోటీనివ్వడానికి ఇదే ఆఖరి అవకాశం. అదే జట్టుకు చెందిన మరో స్టార్ ఉస్మాన్ డెంబెలె సైతం ఆరు గోల్స్తో జోరుమీదున్నాడు. 14 ఏండ్లుగా ఫ్రాన్స్కు చీఫ్ కోచ్గా వ్యవహరిస్తున్న దిదియె డిషాంప్ కూడా ఈ మ్యాచ్తో ఆ జట్టుకు వీడ్కోలు చెప్పబోతున్న నేపథ్యంలో ఫ్రెంచ్ టీమ్ భారీ విజయంపై కన్నేసింది.
మరోవైపు రెండో సెమీస్లో గెలుపు అంచుల దాకా వచ్చిన ఇంగ్లండ్.. మెస్సీ సేన ఆఖర్లో చేసిన అద్భుతంతో తమకు ఎదురైన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నది. టోర్నీలో హయ్యస్ట్ గోల్స్ చేసినవారిలో యువ సంచలనం జూడ్ బెల్లింగ్హామ్ (6), కెప్టెన్ హ్యారీ కేన్ (6) సైతం జోరుమీదున్నారు. కప్పు కలను నెరవేర్చుకోలేకపోయినా మూడో స్థానంతో ముగించాలని ఇరుజట్లూ భావిస్తున్న వేళ రెండు టాప్ టీమ్స్ మధ్య మరో రసవత్తర సమరం జరుగనుండటం ఖాయంగా కనిపిస్తున్నది.