Minister Sabitha Indra Reddy | ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా అల్పాహారాన్ని అందించేందుకు ఉద్దేశించిన ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ ఏర్పాట్లను పూర్తి చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య సంచాలకులు దేవసేన, విద్యాశాఖ అధికారులు, అక్షయపాత్ర ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరుకు చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు దసరా పండుగ నుంచి ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. మెనూ త్వరితగతిన నిర్ణయించి.. అందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. దేశంలోనే పాఠశాలల్లోనే అల్పాహారం అందిస్తున్న రెండోరాష్ట్రంగా తెలంగాణ నిలిచిపోతుందన్నారు.
నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారికి చదువుపట్ల ఏకాగ్రతను పెంచే దిశగా చేపట్టిన పథకంలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు. పథకం అమలును పర్యవేక్షించే బాధ్యతను జిల్లా స్థాయిలో కలెక్టర్కు అప్పగించనున్నట్లు పేర్కొన్నారు. నాణ్యమైన విద్యతో పాటు మంచి పోషకాహారం అందించే దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం విజయవంతం అయ్యేందుకు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు.
పథకం అమలు చేయడం ద్వారా 27,147 పాఠశాలల్లోని దాదాపు 23 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుందని పేర్కొన్నారు. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకంలో సన్న బియ్యాన్ని, విద్యార్థులకు గుడ్లు పంపిణీ చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై అధిక భారం పడుతున్నా తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని మంత్రి వివరించారు.