నాగర్కర్నూల్ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను ‘మన ఊరు – మన బడి’ పథకం కింద రూ.7,300 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా మేడిపూర్లో మన ఊరు – మన బడి పథకానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను తక్కువగా అంచనా వేస్తుంటారనీ, సీఎం కేసీఆర్ చేస్తున్న విద్యా యజ్ఞానికి ఉపాధ్యాయులు పాత్రదారులు కావాలన్నారు. రాష్ట్రం సాధించి వ్యవసాయం, సాగునీటి రంగంలో అభివృద్ధి సాధించినట్లు పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో మార్పు కోసం రాష్ట్రంలో వెయ్యి గురుకులాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఒక్కో స్టూడెంట్పై రూ.1.20లక్షలు ఖర్చు చేస్తున్నామని, రాష్ట్రంలో 26వేల స్కూళ్లను ‘మన ఊరు – మన బడి’ ద్వారా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు పంపకుండా.. ఇంగ్లీష్ చదువుల కోసం ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తున్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభిస్తున్నారన్నారు. పిల్లలు, ఉపాధ్యాయులు ఆందోళన పడొద్దన్నారు. రాష్ట్రంలో అక్షరాస్యతను 65శాతం నుంచి వంద శాతానికి చేర్చుకుందామని పిలుపునిచ్చారు. తరగతి గదుల్లో కావాల్సిన అన్ని సదుపాయాలను కల్పించడం జరుగుతుందన్నారు. నాగర్కర్నూల్ జిల్లాలో రూ.103కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు.
గుడిలా బడిని పవిత్రంగా చూడాలని, రాష్ట్రంలో ఉన్నత విద్యాసంస్థల్లో అమ్మాయిల సంఖ్య పెరుగుతోందని, ఇంటర్ తర్వాత కెరియర్ను ఎంచుకునే స్థాయికి చేరుతారన్నారు. అమ్మాయిలు బాగా చదువుతున్నందుకే మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేశామన్నారు. సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో రాబోయే ఐదేళ్లలో తెలంగాణ పిల్లలు ఉన్నత స్థానాల్లో ఉంటారనీ, పది పరీక్షల్లో విద్యార్థులు బాగా రాయాలన్నారు. కలెక్టర్ అధికారులు, పాఠశాలల్లో పనులు పూర్తయ్యేలా చూడాలనీ,
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలాంటి పథకాల మాదిరిగా మన ఊరు-మన బడిని విజయవంతం చేయాలన్నారు.