షాబాద్, జూన్ 3: రాష్ట్ర వ్యాప్తంగా సర్కారు బడులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం రూ.7 వేల కోట్లు కేటాయించినట్టు విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సర్దార్నగర్, చేవెళ్ల మండలం గుండాల జడ్పీ పాఠశాలల్లో రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీలు జనార్దన్రెడ్డి, వాణిదేవి, జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్తో కలిసి మంత్రి బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె చిన్నారులతో అక్షరాలు దిద్దించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ.. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ మన ఊరు-మనబడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడులకే పంపించాలని సూచించారు.