హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ ప్రారంభం కావడంతో కాంగ్రెస్ నాయకులు బెంబేలెత్తుతున్నారని, ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశం లేకుండా పోయిందన్న అక్కసుతో ఇష్టారీతిన మాట్లాడుతున్నారని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి మండిపడ్డారు. తప్పుడు ఆరోపణలతో కాంగ్రెస్ నేతలు రాజకీయ లబ్ధి పొందేందుకు కుయుక్తులు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వాస్తవాలను పూర్తిగా వక్రీకరించే కుటిలయత్నం చేస్తున్నారని బుధవారం ఆమె ట్వీట్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగానికి పెట్టపీట వేస్తుండటాన్ని కాంగ్రెస్ నేతలు తట్టుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు.
గత తొమ్మిదేండ్లలో ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి రూ.1,87,269 కోట్లు ఖర్చుచేసిందని వివరించారు. 2017లో 8,972 టీచర్ పోస్టులు, ఇటీవల 5,089 టీచర్ పోస్టులు భర్తీ చేశామని తెలిపారు. తొలిసారిగా 796 ప్రాథమిక, 727 స్కూల్ అసిస్టెంట్ పోస్టుల చొప్పున మొత్తంగా 1,523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను భర్తీచేయాలని నిర్ణయించామని వెల్లడించారు. గురుకులాల్లో 11,715 పోస్టులను భర్తీచేశామని, మరో 12,150 సిబ్బంది నియామకాల ప్రక్రియ కొనసాగుతున్నదని వివరించారు. ఇంటర్, పాలిటెక్నిక్, డిగ్రీ కాలేజీల్లోనూ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నదని, గ్రూప్-4 ద్వారా సైతం ఉద్యోగాలను భర్తీచేస్తున్నామని, కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్ధీకరించామని తెలిపారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు.