హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ)/ బండ్లగూడ: రాష్ట్రంలో కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ కాలేజీల్లో విద్యను అందిస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్లోని ఎస్సీఈఆర్టీ గోదావరి ఆడిటోరియంలో ఇంటర్ సీఈసీలో స్టేట్ టాపర్గా నిలిచిన రాజేంద్రనగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థిని మంజుల చౌహాన్తోపాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కోర్సుల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను మంత్రి సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ.. తెలంగాణలో విద్యాలయాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారని అభినందించారు. ఆదివాసీ ఖిల్లాగా పేరున్న కుమ్రంభీం ఆసిఫాబాద్ విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో మెరుగైన ఉత్తీర్ణత సాధించడం ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్, విద్యార్థుల తల్లిదండ్రులు, లెక్చరర్లు పాల్గొన్నారు.
బాసర ట్రిపుల్ ఐటీలో శాశ్వత వసతులు
ట్రిపుల్ ఐటీలో పూర్తిస్థాయిలో వసతులు కల్పించనున్నట్టు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. యుద్ధప్రాతిపదికన నివేదికలు సిద్ధం చేయాలని వీసీ వెంకటరమణను ఆదేశించారు. గురువారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో బాసర ట్రిపుల్ ఐటీ వీసీ, డైరెక్టర్ సతీశ్తో మంత్రి సమీక్షించారు.