రంగారెడ్డి, నవంబర్ 25(నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి రూపాయి ఇవ్వని ప్రధాని మోదీ ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు వచ్చి ఓట్లు అడుగుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. శనివారం మహేశ్వరం నియోజకవర్గ కేంద్రం కందుకూరులో నిర్వహించిన రోడ్ షోలో ఆమె మాట్లాడారు.
మొదటి నుంచీ మోదీ తెలంగాణ అంటేనే విషం కక్కుతారని, తెలంగాణకు వచ్చిన ప్రతిసారి సీఎం కేసీఆర్, కేటీఆర్, కవితలను తిట్టడం తప్పితే రాష్ర్టానికి ఏం చేశాం? ఏం చేస్తాం? అని ఏనాడైనా ప్రజలకు చెప్పారా? అని నిలదీశారు. దేశమంతా మెడికల్ కాలేజీలు ఇచ్చి తెలంగాణకు మొండి చెయ్యి చూ పారని మండిపడ్డారు. ఈ ప్రాంతంలో ఐటీఐఆర్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తే.. ఐదు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించేవని, మోదీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసి యువతకు ఉద్యోగాలు లేకుండా చేశారని విమర్శించారు.