హైదరాబాద్ : పదో తరగతి ఫలితాలను విడుదల చేసిన సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్ ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ విడుదలైన పదో తరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, హైదరాబాద్ జిల్లా చివరిస్థానంలో నిలిచింది. ఇక రెండు, మూడు స్థానాల్లో నిర్మల్, సంగారెడ్డి జిల్లాలు నిలిచాయి.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉత్తీర్ణత శాతం తక్కువ నమోదైన జిల్లాలపై ఈ ఏడాది ఎక్కువ దృష్టి సారిస్తామన్నారు. ఏయే స్కూల్లో మార్కులు తక్కువ వచ్చాయో కూడా నివేదికలు తెప్పించుకొని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. భవిష్యత్లో అన్ని పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం మరింత పెంచేందుకు చర్యలు చేపడుతామన్నారు.
ఇక హైదరాబాద్ ఫలితాలపై రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు మంత్రి ఆసక్తికర సమాధానం ఇచ్చారు. హైదరాబాద్కు పోస్టుమార్టం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. ప్రతిసారి హైదరాబాద్ జిల్లాలో ఉత్తీర్ణత శాతం ఎందుకు తగ్గుతుందనే విషయంపై పరిశీలన చేస్తామన్నారు. మమూలుగా చెప్పడం లేదు.. 100 శాతం ఈ అంశంపై దృష్టి సారించి, చర్యలు తీసుకుంటామని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.