ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 11 : రానున్న రోజుల్లో ఉస్మానియా యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకొస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నదని అన్నారు. ఆరు నెలల వ్యవధిలోనే రూ.113 కోట్లతో ఓయూలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. ఓయూ ఇంజినీరింగ్ కాలేజీకి అనుబంధంగా నిర్మించే బాలుర హాస్టల్ భవనానికి హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి ఆమె మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ.. ప్రపంచంలోనే ఓయూకు ఘన ఖ్యాతి ఉన్నదని, అన్ని రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఓయూ పూర్వ విద్యార్థులు ఉన్నారని గుర్తు చేశారు.
ఇప్పటికే ఓయూలో బాలుర హాస్టల్, నూతన పరిపాలన భవనం, నిజాం కళాశాలలో హాస్టళ్లు, పలు యూనివర్సిటీల్లో హాస్టళ్లను నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఇప్పుడు ఓయూలో రూ.39.50 కోట్లతో ఇంజినీరింగ్ కళాశాల అబ్బాయిలకు హాస్టల్ భవనం నిర్మిస్తున్నామని తెలిపారు. 1.59 ఎకరాల్లో 85,508 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు అంతస్థులతో నిర్మించే ఈ భవనంలో 133 గదుల్లో 532 మంది విద్యార్థులకు వసతి ఉంటుందని పేర్కొన్నారు. ఓయూలో ఈ విద్యాసంవత్సరంలో 65 శాతం మంది అమ్మాయిలు ఉండటం గర్వంగా ఉన్నదని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాణీదేవి, తెలంగాణ రాష్ట్ర విద్య, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ (టీఎస్ఈడబ్ల్యూఐడీసీ) చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి, రాష్ట ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, యూజీసీ డీన్ ప్రొఫెసర్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.