హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ ఈ నెల 25న పర్యటించనున్నారు. పర్యటనలో జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కార్యాలయానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించారు. ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం, ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, సీపీ మహేశ్ భగవత్ అధికారులతో సమీక్షించారు. సీఎం పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్ల చేయాలని ఆదేశించారు. అనంతరం బహిరంగ సభ వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ప్రభుత్వం ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని కొంగర కలాన్లో సకల సదుపాయాలతో రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్ను నిర్మించిన విషయం తెలిసిందే. 40 ఎకరాల స్థలంలో రూ.32 కోట్లు వ్యయంతో అద్భుతంగా నిర్మించింది. ప్రస్తుతం భవన నిర్మాణ పనులు పూర్తవగా.. ప్రారంభానికి సిద్ధమైంది. ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ హాజరుకానుండడంతో కలెక్టర్ అమయ్కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎం కలెక్టరేట్ను ప్రారంభించిన అనంతరం.. 15 ఎకరాల్లో 30వేల మందితో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొని, ప్రసంగించనున్నారు. కలెక్టరేట్ భవనానికి ఎదుట టీఎస్ఐఎస్కు చెందిన 30 ఎకరాల భూమి ఉండడంతో అందులోనే భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.