నిర్మల్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): విద్యార్థులు తమ ఆలోచనలకు పదును పెడితేనే అద్భుతాలు సాధ్యమవుతాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. కొత్త ఆలోచనలతో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించే అవకాశం ఉంటుందని అన్నారు. రాష్ట్రంలోని స్కూల్ విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ సైన్స్ ఫెయిర్లలో అద్భుతాలు సృష్టిస్తుండటం మనందరికీ గర్వకారణమని తెలిపారు. శాస్త్ర సాంకేతిక రంగాలతోనే సమాజం అతి వేగంగా అభివృద్ధి సాధిస్తుందని, అన్ని రంగాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆలోచనా విధానం కూడా మారాలని సూచించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్ స్కూల్లో సోమవారం ఏర్పాటుచేసిన 50వ రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ను అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నారని చెప్పారు. మూస పద్ధతికి స్వస్తిపలికి నూతన విద్యావిధానాన్ని పాటించాలని ఉపాధ్యాయులకు సూచించారు. మన ఊరు మన బడి పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలన్నీ కొత్త రూపు సంతరించుకుంటున్నాయని చెప్పారు. 33 జిల్లాల నుంచి వచ్చిన బాలశాస్త్రవేత్తలు నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టి, రాబోయే రోజుల్లో సమాజానికి మరింతగా ఉపయోగపడాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రతిసారి హైదరాబాద్లో నిర్వహించే రాష్ట్రస్థాయి సైన్స్ఫెయిర్ను ఈ సారి నిర్మల్లో జరుపుకోవడం ఆనందంగా ఉన్నదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన విద్యార్థులకు, వారి వెంట వచ్చిన గైడ్లకు మూడు రోజులపాటు ఇక్కడ ఉండేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. విద్యార్థుల్లో వినూత్న ఆలోచనలు రేకెత్తించడానికి ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతో ఉపయోగపడుతాయని అన్నారు. కార్యక్రమంలో ముధోల్, ఖానాపూర్, బోథ్ ఎమ్మెల్యేలు విఠల్రెడ్డి, రేఖానాయక్, రాథోడ్ బాపురావ్, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన, నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ తదితరులు పాల్గొన్నారు.