హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): ఏజెన్సీ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యకలాపాలపై ఆమె మంగళవారం సమీక్షించారు. భారీ వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు.
గురుకుల విద్యాలయాల్లో ఫీవర్ సర్వేలు నిర్వహించాలని, మరుగుదొడ్లు, భోజనశాలలు, వంట గదుల్లో పారిశుధ్య చర్యలు చేపట్టాలని సూచించారు. గిరివికాస పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని, దీనికోసం తక్షణమే కార్యాచరణ రూపొందించాలని కోరారు. గిరిపోషణతోపాటు, కేసీఆర్ న్యూట్రిషన్, బాలామృతం కిట్లను ఆదివాసీలకు అందించాలని సూచించారు. సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ, ప్రత్యేక కార్యదర్శి శ్రీధర్, అదనపు కార్యదర్శులు సర్వేశ్వర్రెడ్డి, గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి నవీన్ నికోలస్ తదితరులు పాల్గొన్నారు.