ఖమ్మం : తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్ పాలనలో దళారులదే హవా కొనసాగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్(Minister Puvvada) ఆరోపించారు. ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో శుక్రవారం ఆయన పలు డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు, ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి, బీసీ రుణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
గత ప్రభుత్వాల హయాంలో ఏ పథకం లబ్ధి పొందాలన్నా ప్రజలు ముందు దళారుల(Brokers) వద్దకు వెళ్లేవారని, ఇప్పుడా అవసరం లేదన్నారు. అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత వృద్ధుల పింఛనును రూ.2016, దివ్యాంగుల పింఛన్ను రూ.3,016కు పెంచారని గుర్తు చేశారు. గతంలో ఏ ప్రభుత్వమూ ఇంత మొత్తంలో పింఛన్(Pensions) ఇవ్వలేదన్నారు.
నిరుపేదల వైద్యం కోసం సకాలంలో సీఎంఆర్ఎఫ్(CMRF) అందిస్తున్నామన్నారు. కులవృత్తులను ప్రోత్సహించేందుకు రుణ సదుపాయాలు కల్పిస్తున్నారని కొనియాడారు. సీఎం కేసీఆర్ను గద్దెదించుతామని కొందరు ఎన్నికల సమయంలో పగటి వేషగాళ్లలో ప్రజల మధ్యకు వస్తారని వారికి ఓట్లతోనే గుణపాఠం చెప్పాలన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రజలు మూడోసారీ బీఆర్ఎస్నే గెలిపించాలని, సీఎం కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ వీపీ గౌతమ్, ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.