తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకై ప్రత్యేక చర్యలు తీసుకుందని, షీటీమ్ వ్యవస్థను ఎర్పాటు చేసి పటిష్ట పోలీస్ భద్రతను కల్పించడం జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. మహిళల భద్రత & లింగ సమానత్వం గురించి అవగాహన కల్పించేందుకు ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం నుండి లకారం ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన షీ-టీమ్స్ రన్ను ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పువ్వాడ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా
షీ-టీమ్లు పని చేస్తున్నాయని అన్నారు. గతంలో లాగా మహిళలపై ఆకతాయిలు, పోకిరీల అఘాయిత్యాలు, చోరీలు తగ్గిపోయాయని, నేరగాళ్లకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కేసీఅర్ తీసుకున్న కఠినమైన నిర్ణయాల వల్లే ఇది సాధ్యమైందని ఆయన అన్నారు.
‘సుస్థిరమైన రేపటి కోసం ఈ రోజు లింగ సమానత్వం’ అనే థీమ్కు అనుగుణంగా, ఖమ్మం పోలీస్ శాఖ షీ-టీమ్ ఆధ్వర్యంలో జెండర్ ఈక్వాలిటీ 2కే, 5కే రన్ను నిర్వహించడం అభినందనీయమన్నారు.ఖమ్మంకు పోలీస్ కమిషనరేట్ తీసుకురావాలని నాడు అనేక మార్లు ముఖ్యమంత్రి కేసీఅర్ దృష్టికి తీసుకెళ్ళి సాదించుకున్నామన్నారు.
సీసీ కెమెరాల నిఘా వ్యవస్థను పెంచటం వల్లే నేరాలను అదుపులో ఉంచగలిగామన్నారు. అందుకు కృషి చేస్తున్న పోలీస్ యంత్రాంగాన్ని మంత్రి అభినందించారు. మహిళల రక్షణ కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మహిళలకు నిరంతరం రక్షణ కల్పిస్తుందని తెలియజేశారు. అనంతరం మహిళల భద్రత మరియు లింగ సమానత్వంపై ఈ రన్ ద్వారా అవగాహన కల్పిస్తున్న నిర్వాహకులను అభినందించారు.
అనంతరం రన్ పూర్తి చేసిన వారికి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ సుడా చైర్మన్ విజయ్ జిల్లా కలెక్టర్ వీపీ గౌతం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి అదనపు డీసీపీలు గౌస్ అలం పూజ సుభాష్ చంద్ర బోస్ ఏసీపీలు స్నేహామెహ్రా ఆంజనేయులు రామోజీ రమేష్ విజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు.