హైదరాబాద్ : ఈ విశ్వం మీద నివసిస్తున్న సకల జీవరాశులకు చెట్లే ప్రణవాయువు అని, మొక్కల ప్రాముఖ్యతను తెలుసుకుని ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆధ్యాత్మికత, యోగా రంగాల్లో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన బ్రహ్మ కుమారీస్ సమాజం అధ్వర్యంలో చేపట్టిన 40 లక్షల మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా సోమవారం మంత్రి పువ్వాడ నివాసంలో బ్రహ్మకమారిలతో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ..యోగా, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలను బోధించే బ్రహ్మకుమారీలు 50వ ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం’ సందర్భంగా మొక్కలు నాటాలనే బృహత్తర సంకల్పంతో ‘కల్ప తరు’ పేరున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు.
పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం కులషితమై మనిషి మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందనే ఆవేదనతోముఖ్యమంత్రి కేసీఅర్ హరితహరం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. మొక్కలు నాటడంతో మాత్రమే ఈ సృష్టిని కాపాడగలమనే ఒకే ఒక్క నమ్మకంతో కేసీఅ కొనసాగిస్తున్న హరితహారం అడుగుజాడల్లో బ్రహ్మకుమారీ సమాజం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం మంచి నిర్ణయమన్నారు.
జూన్ 5వ తేదీ నుంచి ఆగస్టు 25 వరకు జరగనున్న‘కల్పతురు క్యాంపెయిన్’ లో భాగంగా క్యాంపెన్ ద్వారా దేశ వ్యాప్తంగా బ్రహ్మకుమారీస్ సెంటర్ల తరఫున 40లక్షల మందితో కనీసం 40 లక్షల మొక్కలు నాటేందుకు కృషి చేస్తున్నట్లు బ్రహ్మకుమారీ అరుణ తెలిపారు. కార్యక్రమంలో బ్రహ్మ కుమారీలు బీకే గీత, బీకే రమాదేవి, బీకే ప్రసాద్, బీకే అన్నపూర్ణ తదితరులు ఉన్నారు.