ఖమ్మం : ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేలా బీఆర్ఎస్ శ్రేణులు కృషి చేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్(Minister Puvvada Ajaykumar) పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రామనుజవరంలో శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం(Brs Meeting)లో ఆయన మాట్లాడారు.
స్వార్థపూరిత రాజకీయాలు చేసే వారితో అప్రమత్తంగా ఉండాలన్నారు. వారి రాజకీయాలు ఎండగట్టి ప్రజలకు వివరించాలన్నారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి సీఎం కేసీఆర్(CM KCR) ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ప్రజాసంక్షేమం కోసం పనిచేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపారని కొనియాడారు.
ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ(Telangana) నంబర్ వన్ అని, దేశానికే అన్నం పెట్టే స్థాయికి రాష్ట్రం ఎదిగిందన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని(Ambedkar Statue) ఆవిష్కరించి ఆత్మ గౌరవ ప్రతీకగా దేశానికి చాటి చెప్పారన్నారు. పన్నుల రూపేణా వేల కోట్ల ఆదాయం తీసుకెళ్తున్న కేంద్రం(Central Government) రాష్ట్రానికి నిధులు కేటాయింపులో అన్యాయం చేస్తుందని మండిపడ్డారు.
సమ్మేళానానికి అధ్యక్షత వహించిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్నివర్గాల అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, బీఆర్ఎస్ తల్లాడ, పెనుబల్లి మండలాల అధ్యక్షులు రెడ్డెం వీరమోహన్రెడ్డి, కనగాల వెంకట్రావు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు.