ఖమ్మం : కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మొట్టమొదటగా చేసేది 24 గంటల విద్యుత్ కోత విధిస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ( Minister Puvvada Ajay kumar ) ఆరోపించారు. ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలం వీ వెంకటాయపాలెం గ్రామంలో నిర్వహించిన రైతు సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఎకరం భూమిని తడిపేందుకు గంట, మూడెకరాలకు మూడు గంటల కరెంటు సరిపోతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ( Revanth Reddy ) మతిభ్రమించి మాట్లాడుతున్నాడన్నారు.
రేవంత్ వ్యాఖ్యలు రైతులను హేళన చేసే విధంగా ఉన్నాయన్నారు. మూడు గంటల విద్యుత్ అంటూ అన్నదాతల (Farmers ) జీవితాలను ఆగం చేసేలా మాట్లాడిన రేవంత్రెడ్డిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా కాంగ్రెస్ను బొందపెడితేనే రైతాంగం బాగుపడుతుందన్నారు. రైతులను కష్టపెట్టిన వారు బాగుపడినట్లు చరిత్రలోనే లేదన్నారు.
దమ్ముంటే రైతులకు మూడు గంటల కరెంటు ప్రతిపాదనను మ్యానిఫెస్టో ( Manifesto ) లో పెట్టి వచ్చే ఎన్నికల్లో ఓట్లడిగేందుకు రావాలని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఖమ్మం నగర మేయర్ పునకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, వీ.వెంకటాయపాలెం సర్పంచ్ రావెళ్ల మాధవి, ఎంపీటీసీ యరగర్ల హనుమంతరావు, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు తొలుపునూరి దానయ్య, బీఆర్ఎస్ నాయకులు కుతుంబాక నరేశ్, పగడాల నాగరాజు పాల్గొన్నారు.