ఖమ్మం, మార్చి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేసీఆర్ విజన్తో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతున్నదని, కానీ ఆ ప్రగతిని కళ్లున్నా కొందరు కబోదులు చూడలేకపోతున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజుతో కలిసి శనివారం ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
సీఎం కేసీఆర్కు పార్టీ పరంగా ఎవరు శత్రువులైనా వారు తనకూ శత్రువులేనని స్పష్టం చేశారు. ఉన్న పార్టీకి ద్రోహం చేయడం తల్లి పాలు తాగి రొమ్ముగుద్దడం లాంటిదని అభిప్రాయపడ్డారు. పార్టీలో ఉంటూనే వేరే పార్టీ అభ్యర్థులకు డబ్బు సంచులు పంపిన చరిత్ర వారికున్నదని విమర్శించారు. జెండా, ఎజెండా లేకుండా, దిశ, దశ లేకుండా కొందరు రాజకీయ లబ్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై నిరాధార ఆరోపణలు చేస్తేనో, రాజకీయంగా పెద్దోళ్లు అవుతారనుకుంటే అది ప్రత్యర్థుల భ్రమేనని తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ లోక్సభభా పక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ జ్వరాన్ని సైతం లెక్కచేయకుండా పంట పొలాల్లో తిరిగి బాధిత రైతులకు రూ.10వేల సహాయాన్ని ప్రకటించిన మనసున్న మహరాజు కేసీఆర్ అని కొనియాడారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు తపన పడే ఇతర పార్టీల నేతల పట్ల అప్రమత్తంగా ప్రజలు ఉండాలని హితవు పలికారు.