ఖమ్మం: పదవుల కోసం మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధమస్థాయికి దిగజారారని మంత్రి పువ్వాడ అజయ్ (Minister Puvvada Ajay) అన్నారు. కేసీఆర్ (CM KCR) గురించి తమ్ముల (Tummala Nageshwara rao) ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం బాధాకరమన్నారు. 2014లో మంత్రి పదవి ఇచ్చి ఉండకపోతే తమ్ముల ఇంటికే పరిమితమయ్యేవారని విమర్శించారు. ఖమ్మంలో బీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్రతో కలిసి మంత్రి పువ్వాడ అజయ్ మీడియాతో మాట్లాడారు. తుమ్మలపై ఆధారపడి కేసీఆర్ అధికారంలోకి వచ్చారా అని ప్రశ్నించారు. తానే కేసీఆర్కు మంత్రి పదవి ఇప్పించినట్లు ఆరోపిస్తున్నారని అది చాలా హాస్యాస్పదమన్నారు.
కేసీఆర్, తుమ్మల నాగేశ్వర రావు ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. కేసీఆర్ వల్లే తుమ్మలకు మంత్రి పదవి వచ్చిందని తెలిపారు. గత ఎన్నికల్లో తుమ్మల ఓటమికి ఉపేందర్ రెడ్డికి డబ్బులు ఇచ్చినట్లు ఆరోపిస్తున్నారని విమర్శించారు. తుమ్మలకు టికెట్ ఇచ్చి ఓటమి కోసం డబ్బులిస్తారా అని ప్రశ్నించారు. అంతకన్నా ఆయనకు టికెట్ ఇవ్వకపోతే సరిపోయేది కదా అన్నారు. తుమ్మల నాగేశ్వరరావు ఎప్పుడూ జై తెలంగాణ అనలేదని విమర్శించారు. తెలంగాణ నినాదం చేసినవారిని జైలుపాలు చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.