Sri Ramanavami | భద్రాద్రి కొత్తగూడెం : ఈ నెల 30వ తేదీన శ్రీరామ నవమి పురస్కరించుకుని భద్రాద్రి( Bhadradri ) శ్రీసీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం ఈసారి అంగరంగ వైభవంగా నిర్వించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్( Minister Puvvada Ajay Kumar ) స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. శ్రీరామనవమి ఉత్సవ ఏర్పాట్లపై మంత్రి అజయ్ కుమార్ ఇవాళ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రెండో అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలంలో స్వామివారి కల్యాణ మహోత్సవం.. వేలాది మంది భక్తజనం నడుమ వైభవోపేతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సీతారామ కళ్యాణమహోత్సవాన్ని తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చే అశేష భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. ఈ సారి లక్ష మందికి పైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున స్వామివారి ప్రసాద లడ్డూలను అధిక సంఖ్యలో పెంచి, విరివిగా కౌంటర్లను ఏర్పాటు చేసి భక్తులకు అందుబాటులో ఉంచాలన్నారు. భక్తుల కోరిక మేరకు తలంబ్రాలు అందుబాటులొ ఉండేలా ఎక్కువ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. నిర్దేశించిన పనులన్నీ 28వ తేదీ నాటికి పూర్తి చేయాలని, మిథిలా స్టేడియం స్వామివారి కళ్యాణ మండపం వద్ద భక్తులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన సౌకర్యాల ఏర్పాట్లు చేయాలన్నారు.
సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక వసతి, మరుగుదొడ్లు, ఉచిత వైద్యశిబిరాలను ఏర్పాట్లు చేయాలని సూచించారు. పార్కింగ్ ప్రాంగణాలు దూర ప్రాంతాలలో కాకుండా సాధ్యమైనంత దెగ్గరగా ఉండేలా చూడాలని సూచించారు. ముఖ్యంగా పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలని, కళ్యాణం వేడుకను తిలచించేందుకు వచ్చే భక్తులు వేసవి తాపానికి గురై అనారోగ్యానికి గురికాకుండా, వారికి ఎప్పటికప్పుడు ORS, మజ్జిగ, వాటర్ ప్యాకెట్స్ అందించాలన్నారు.
ఈ సమీక్షా సమావేశానికి జిల్లా కలెక్టర్ అనుదీప్, పోలీస్, పంచాయతీరాజ్, విద్యుత్, రవాణా, గ్రామ పంచాయతీ, ఆర్టీసి, వైద్య ఆరోగ్య, ఇరిగేషన్, ఫైర్, రెవెన్యూ, ఎండోమెంట్ సంభందిత శాఖల అధికారులు, ఆలయ అర్చకులు హాజరయ్యారు.