ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ (Congress) పరిపాలన ప్రజలకు కొత్తేమీ కాదని మంత్రి పువ్వాడ అజయ్ (Minister Puvvada Ajay) అన్నారు. ఆ పార్టీ సృష్టించిన అనేక సమస్యలను తమ ప్రభుత్వం పరిష్కరించిందని చెప్పారు. బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సాగునీటి ప్రాజెక్టులు కట్టుకున్నామని వెల్లడించారు. ఖమ్మంలో ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్రతో కలిసి మంత్రి పువ్వాడ అజయ్ మీడియాతో మాట్లాడారు. తాము అమలుచేస్తున్న అనేక పథకాలను కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో పెట్టిందని విమర్శించారు. తాము ఇస్తున్న రైతుబంధును (Rythu Bandhu) కాపీ కొట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆసరా పింఛను (Aasara Pension) పథకం బీఆర్ఎస్దా లేదా కాంగ్రెస్ పార్టీదా అని ఆలోచించాలన్నారు. ఈసారి కూడా తమ పార్టీకి 88 నుంచి 90 స్థానాలు వస్తాయని స్పష్టం చేశారు.
ఖమ్మం జిల్లాను సీఎం కేసీఆర్ (CM KCR) ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. పదేండ్ల పాటు ఖమ్మం నగర ప్రజలతో మమేకమయ్యానని చెప్పారు. వర్తక, వాణిజ్య సంఘాల వారిపట్ల నిబద్ధతతో పనిచేశానని తెలిపారు. తాను ఖమ్మం భూమి పుత్రుడినని, ఇక్కడే పుట్టాను, ఇక్కడే చదువుకున్నా, నివాసం ఉంటున్నానని చెప్పారు. ఖమ్మం నగర అభివృద్ధి పట్ల తనకున్న ఆతృత బయటివారికి ఉండదన్నారు. నగరానికి కష్టం వచ్చినప్పుడు ఇప్పుడు తిరిగే నాయకులు కనబడలేదన్నారు. సీఎం కేసీఆర్ ఖమ్మం నగరానికి ఏం కావాలన్నా చేస్తున్నారని వెల్లడించారు.
ముఖ్యమంత్రి సహకారంతో నగరాన్ని మంత్రి పువ్వాడ ఎంతో అభివృద్ధి చేశారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. నగరాభివృద్ధి కోసం అజయ్ కుమార్ను మరోసారి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. వేరే పార్టీలు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు.