హైదరాబాద్ : భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నది. వరద పరిస్థితులపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, సహాయక చర్యలు చేపట్టేందుకు హెలికాప్టర్తో పాటు అవసరమైన వాహనాలను సమకూర్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నడూ లేని విధంగా భద్రాచలంలో గోదావరి వరద తీవ్రస్థాయిలో ప్రవహిస్తుండగా, జిల్లావ్యాప్తంగా వివిధ గ్రామాల్లోని వరద బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు సీఎం కేసీఆర్ స్పందించిన తీరుపై ధన్యవాదాలు తెలిపారు.
గంట గంటకు ప్రమాద భరితంగా ప్రవహిస్తున్న గోదావరి ఉదృతిని అధిగమించేందుకు, రక్షణ చర్యల్లో భాగంగా తన విజ్ఞప్తి మేరకు హెలికాప్టర్ను సమకూర్చడంతో పాటు కోరిన గంటల వ్యవధిలోనే జిల్లాకు ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, సింగరేణి, రెస్క్యూ బృందాలను తరలించి వరద సహాయక చర్యలు సమర్థవంతంగా చేపట్టేందుకు సీఎం అవకాశం కల్పించారన్నారు. ఇప్పటికే భద్రాచలంలో 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఆర్మీకి చెందిన 5 బృందాలు, సింగరేణి రెస్క్యూ టీమ్లు సిద్దంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా వరదలను అధిగమిస్తామన్నారు.