ఖమ్మం, జూన్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రస్తుత క్లిష్ట్ట పరిస్థితుల్లో దేశానికి కేసీఆర్ నాయకత్వమే శరణ్యమని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ దివాలాకోరు విధానాలను ఎదుర్కొని ప్రజల అవసరాలు తీర్చే సామర్థ్యం ఒక్క సీఎం కేసీఆర్కే ఉన్నదన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్తలు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి రాజ్యసభ సభ్యులుగా ఎంపికైన తర్వాత తొలిసారి శనివారం జిల్లాకు వచ్చిన సందర్భంగా ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ‘సీఎంకు కృతజ్ఞత సభ’ నిర్వహించారు. సభకు హాజరైన మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. దేశంలోని యువత ప్రాణాలతో బీజేపీ సర్కారు చెలగాటం ఆడుతున్నదని ధ్వజమెత్తారు. సైనిక కొలువులను సైతం కాంట్రాక్టు ఉద్యోగాలుగా మారుస్తున్నదని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ మరోపోరుకు సిద్ధమవుతున్నదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించాలని డిమాండ్చేశారు. లేనిపక్షంలో బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఖమ్మం జిల్లా నుంచి వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డిలకు రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అధ్యక్షతన జరిగిన సభలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్రెడ్డి, రాములునాయక్, హరిప్రియా నాయక్, మెచ్చా నాగేశ్వరరావు, జడ్పీ చైర్మన్లు లింగాల కమల్రాజు, కోరం కనకయ్య, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, పూల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్రానివి అనాలోచిత నిర్ణయాలు: నామా
కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్నదని టీఆర్ఎస్ లోక్సభ పక్షనేత ఎంపీ నామా నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తంచేశారు. బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్ట గలిగే శక్తి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు మాత్రమే ఉన్నదన్నారు.
బీసీల గొంతుకనై పనిచేస్తా: వద్దిరాజు రవిచంద్ర
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. వెనుకబడిన వర్గాల గొంతుకగా మారి, వారికి అండగా నిలుస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయానికి కృషి చేస్తానని తెలిపారు.
అభివృద్ధిలో భాగస్వామిగా: బండి పార్థసారథిరెడ్డి
రాష్ర్టాభివృద్ధిలో తాను భాగస్వామినవుతానని రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు యావత్ దేశాన్నే ఆకర్షిస్తున్నాయని చెప్పారు. ప్రజల కష్టాలు తెలిసినవాడిగా వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
పదవుల్లో ప్రాధాన్యం: పల్లా
సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లాకు రాజకీయంగా అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి జిల్లా సస్యశ్యామలం కానున్నదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై చూపిస్తున్న వివక్షపై పోరాడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకంత దేశంలో చిచ్చు రేపుతున్నదన్నారు. యువకులను అభద్రతా భావంలోకి నెట్టి మోదీ సర్కారు చోద్యం చూస్తున్నదని మండిపడ్డారు.