ఖమ్మం, మార్చి 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘కేసీఆర్ను గద్దె దించే స్థాయి.. శక్తి ఎవరికీ లేదు.. పొంగులేటి ముందు నీస్థాయి ఏంటో తెలుసుకో. పిచ్చి కూతలు కూస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు’ అని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డిపై నిప్పులు చెరిగారు. నిన్నటివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ పంచన ఉన్న శ్రీనివాస్రెడ్డి తన స్థాయికి మించి మాట్లాడుతున్నాడని, రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అభివృద్ధి ఎక్కడ జరిగిందని విషం చిమ్ముతున్న వారు.. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాల్లో పరీక్షలు చేయించుకోవాలని హితవు పలికారు. ఖమ్మం నగరంలోని 16, 18, 19, 21, 22, 23, 44, 51, 57, 58వ డివిజన్లలో పేదలకు ఇండ్ల పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. పొంగులేటి జిల్లా రాజకీయాలను భ్రష్టుపట్టించారని ధ్వజమెత్తారు. పొంగులేటి తన స్థాయికి మించి బీఆర్ఎస్, ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని అన్నారు. ఖమ్మంలో ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్, పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని తెలిపారు. ఎన్నికలు వస్తుండటంతో కొందరు నాయకులు బయల్దేరారని, ఎలాంటి ఎజెండా లేకుండా కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కల్లబొల్లి మాటలను ఖమ్మం జిల్లా ప్రజలు నమ్మరని అన్నారు.
గోదావరి ఉధృతికి కొట్టుకుపోతావ్
సాగుకు ఉచితంగా కరెంటు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు వంటి పథకాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాయని చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుందని అన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలతో రైతుల కాళ్లు కడిగే రోజు దగ్గరోనే ఉన్నదని, దీన్ని ఎవరూ ఆపలేరన్నారు. గోదావరి జలాల ఉధృతికి ఈ తరహా నేతలు, ప్రతిపక్షాలు కొట్టుకుపోవడం ఖాయమని మంత్రి స్పష్టం చేశారు.
అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నదని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో జరిగిన అభివృద్ధిపై టేకులపల్లిలోని డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల మధ్య చర్చిద్దామని, దీనికి పొంగులేటి సిద్ధమా? అని మంత్రి సవాలు విసిరారు. జిల్లాలో ఎంతమేరకు అభివృద్ధి జరిగిందో తాను చూపించడానికి సిద్ధంగా ఉన్నానని, కళ్లుంటే చూడటానికి రావాలని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలు గెలిపించి సీఎం కేసీఆర్కు కానుకగా అందిస్తామన్నారు.
కేసీఆర్కు హ్యాట్రిక్ విజయం ఖాయం
రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని పువ్వాడ తెలిపారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఖమ్మంలో కొందరు నాయకులు ఎజెండా లేకుండా బయలుదేరారని విమర్శించారు. పొంగులేటి తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కల్లబొల్లి మాటలు చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. కేసీఅర్ను గద్దె దింపుతామంటూ పిచ్చికూతలు కూస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఎవరికి, ఎప్పుడు, ఎలా బుద్ధి చెప్పాలో ప్రజలకు తెలుసని, తగిన సమయంలో వారే సమాధానం చెప్తారని హెచ్చరించారు.