Minister Prashanth Reddy | హైదరాబాద్ : తెలంగాణ ప్రజల మదిలో అమరుల త్యాగాలు నిరంతరం జ్వలిస్తూ ఉండేలా దీపం ఆకృతి వచ్చేలా స్మారకాన్ని నిర్మిస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును కాంక్షిస్తూ జలదృశ్యంలో సమావేశం జరిగిన ప్రదేశంలోనే నేడు ఈ స్మారకాన్ని నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు.
హుస్సేన్సాగర్ ఒడ్డున రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం తుదిదశ నిర్మాణ పనులను మంగళవారం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ప్రధాన ద్వారం వద్ద రోడ్డు పనులకు సంబంధించి పలు సూచనలు చేసిన మంత్రి, అనంతరం నిర్మాణ ప్రాంగణమంతా కలియదిరిగారు. ఆ తరువాత అధికారులు, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా నిర్మాణం పూర్తికావాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
తెలంగాణ అమరవీరుల స్థూపం అరుదైన స్టెయిన్లెస్ స్టీల్తో నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద కట్టడమని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. కేసీఆర్ నేతృత్వంలో ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని కాంక్షిస్తూ ఎక్కడైతే మొట్టమొదటి సమావేశం జరిగిందో అదే స్థలంలో నేడు కేసీఆర్ నేతృత్వంలోనే అమరవీరుల స్థూపాన్ని నిర్మిస్తున్నామన్నారు. జలదృశ్యం, టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటును జీర్ణించుకోలేక అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ కార్యాలయంలోని సామాన్లు, ఫర్నీచర్ను బయట పడేయించారని గుర్తుచేస్తూ, ఎక్కడైతే అవమానించబడ్డామో అక్కడే ఇప్పుడు సీఎం కేసీఆర్ నేతృత్వంలో అమరుల స్మారక చిహ్నాన్ని నిర్మిస్తున్నామన్నారు మంత్రి వేముల. రాష్ర్టానికి అతిథులు, ప్రముఖులు ఎవరు వచ్చినా ఈ స్మారకాన్ని సందర్శించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. త్వరలోనే కేసీఆర్ చేతులమీదుగా ఈ నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి వెంట ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, శిల్పి రమణారెడ్డి తదితరులు ఉన్నారు.