హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు హుస్సేన్ సాగర్ ఒడ్డున అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం నిర్మాణ పనులను మంత్రి ప్రశాంత్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. నిర్మాణ ప్రాంగణమంతా సుమారు 4 గంటల పాటు కలియతిరిగారు. నిర్మాణ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులకు, వర్క్ ఏజెన్సీకి పలు సూచనలు చేశారు. స్టెయిన్ లెస్ స్టీల్ షీట్స్ బిగింపు తుదిదశ పనులు పరిశీలించారు. మెయిన్ ఎంట్రన్స్, ఫ్లోరింగ్ పనులు,ఫౌంటెన్ ఏరియా, తెలంగాణ తల్లి విగ్రహ నిర్మాణం, ల్యాండ్ స్కేప్ ఏరియా, మ్యూజియం, ఫోటో గ్యాలరీ, ఆడిటోరియం, పై అంతస్తులో నిర్మించే రెస్టారెంట్ నిర్మాణ పనులు పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు నిర్మాణ ప్రాంగణమంతా పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉండాలని సూచించారు.
అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు.. తెలంగాణ అమరుల త్యాగాలను ప్రతిబింబించే విధంగా నిరంతరం జ్వలించే జ్వాలలా ఉండే దీపం ఆకృతి నిర్మాణ పనుల్లో పలు సూచనలు చేశారు. మ్యాన్ పవర్ పెంచి మూడు షిఫ్టుల్లో పనులు జరగాలని, నిర్మాణ తుది పనుల్లో ఇంకా వేగం పెంచాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో సీఎం విధించిన నిర్ణీత గడువులోగా ఈ ప్రతిష్టాత్మక నిర్మాణం పూర్తి కావాలని అధికారులకు, వర్క్ ఏజెన్సీకి మంత్రి స్పష్టం చేశారు.