న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో యావత్ తెలంగాణ ప్రజలు సగర్వంగా తలెత్తుకునేలా దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మించుకుంటున్నామని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇంతటి చారిత్రాత్మక, బృహత్తర కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేసినందుకు టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లకు మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఢిల్లీలోని వసంత్ విహార్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణ పనుల్లో శుక్రవారం మరో ముందడుగు పడింది. మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి నిర్మాణపనులకు శ్రీకారం చుట్టారు. లోవర్ గ్రౌండ్ త్రవ్వకం పనులు ఇప్పటికే పూర్తి కాగా, పుటింగ్ పనులు ప్రారంభం కోసం ఈ రోజు ముగ్గు పోశారు. మిగతా పనులు త్వరలో పూర్తి చేయనున్నారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలంగాణ భవన నిర్మాణ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పనులు పర్యవేక్షించిన అనంతరం వర్క్ ఏజెన్సీతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ఢిల్లీలో తెలంగాణ భవన నిర్మాణ పనులు జరగాలని మంత్రి ఆదేశించారు. అనుకున్న లక్ష్యానికి అనుగుణంగా పనులు వేగంగా.. అలాగే నాణ్యతతో జరగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్ తేజ, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.