హైదరాబాద్ : హైదరాబాద్ నగరం నడిబొడ్డున నిర్మితమవుతున్న నూతన సచివాలయం పనులను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. సుమారు 4 గంటల పాటు సెక్రటేరియట్ నిర్మాణ ప్రాంగణమంతా కలియ తిరుగుతూ నిర్మాణంలో ఉన్న ప్రతి పనిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రెడ్ సాండ్ స్టోన్ అమరిక పనులను పరిశీలించారు. పనుల్లో ఇంకా వేగం పెంచాలని ఏజెన్సీ అధికారులను మంత్రి ఆదేశించారు. సీఎం కేసీఆర్ విధించిన గడువులోగా పనులు పూర్తి కావాలన్నారు. బ్లాక్ వైజ్ పనుల్లో ఇంకా వేగం పెంచాలని సూచించారు.
గ్రాండ్ వెల్కమ్ ఎలివేషన్ పనుల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. ఈ పనులన్నీ సమాంతరంగా జరిగేలా ఆర్ అండ్ బి ఇంజనీర్లు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. కాంపౌండ్ వాల్కి వచ్చే రేయిలింగ్ పనులను వెంటనే మొదలు పెట్టాలని అధికారులకు సూచించారు. గుడి, మసీదు, చర్చి, సెక్యూరిటీ బ్లాక్, ఆన్సిలరీ బిల్డింగ్ల పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సచివాలయ నిర్మాణ పనుల పరిశీలనలో మంత్రి వెంట ఆర్ అండ్ బి ఈఎన్సీ గణపతి రెడ్డి, ఎస్ఈ సత్యనారాయణలతో పాటు పలువురు అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, వాస్తు నిపుణులు సుధాకర్ తేజ ఉన్నారు.