Telangana | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్( Hyderabad ) నగరం నడిబొడ్డున రాష్ట్ర ప్రభుత్వం( Telangana Govt ) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్( Ambedkar Statue ) 125 అడుగుల విగ్రహం నిర్మాణ పనులు ఈనెల 30వ తేదీలోగా పూర్తిచేయాలని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి( Minister Prasthanth Reddy ) అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) ఆదేశాల మేరకు విగ్రహాన్ని అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న ఆవిష్కరించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈలోగా అన్ని పనులనూ పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.
మంత్రి ప్రశాంత్ రెడ్డి అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను మంగళవారం పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేస్తున్న రాక్ గార్డెన్, ల్యాండ్ స్కేపింగ్, ప్లాంటేషన్, మెయిన్ ఎంట్రన్స్, వాటర్ ఫౌంటెన్, సాండ్ స్టోన్ వర్క్స్, జీఆర్సీ, గ్రానైట్ ఫ్లోరింగ్, లిఫ్ట్, విగ్రహం వద్దకు చేరుకునే మెట్లదారి, ర్యాంప్, బిల్డింగ్ లోపల ఆడియో విజువల్ రూమ్, ఫాల్ సీలింగ్ తదితర పనులను దగ్గరుండి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు, వర్క్ ఏజెన్సీతో సమావేశమై రోజువారీ పనుల పురోగతిపై చర్చించారు. అంతేకాకుండా ప్రారంభం గడువు దగ్గర పడుతుండడంతో గడువులోగా పనులు పూర్తిచేసేందుకు అవసరమైన కార్యప్రణాళికను వారికి తెలియజేశారు. ఈ నెల 28వ తేదీవరకు ఎంట్రన్స్ లాన్స్, 30వరకు ప్రధాన విగ్రహం, ఏప్రిల్ ఒకటి వరకు రాక్గార్డెన్, ఐదవ తేదీవరకు ప్లాంటేషన్ పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. పనులను వేగంగా పూర్తిచేసేందుకుగాను అవసరమైతే మ్యాన్పవర్ను పెంచాలని ఆదేశించారు. చరిత్రలో నిలిచిపోయే ఇంత భారీ విగ్రహ నిర్మాణ పనుల్లో భాగస్వాములు కావడం మనందరికీ ఎంతో గర్వకారణమన్నారు. కోట్లాది మంది హృదయాలను హత్తుకునే ఈ విగ్రహ నిర్మాణంలో ప్రతిఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని మంత్రి సూచించారు.