నిజామాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ జనరంజక పాలన, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గం ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామానికి చెందిన వార్డ్ సభ్యులు సింగరి హేమంత్, వారి అనుచరులు శనివారం హైదరాబాద్లో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి వారికి గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్బంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఆనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. తెలంగాణ ప్రగతి దేశానికి నేడు రోల్ మోడల్గా నిలిచిందన్నారు. తెలంగాణ లాగే తమకు అభివృద్ది కావాలని దేశ వ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారని, బీఆర్ఎస్ తోనే దేశ పురోగతి సాధ్యమని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత దేశానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని మంత్రి పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో రెంజర్ల సర్పంచ్ ఆకుల రాజారెడ్డి, ముప్కాల్ మండల ఎంపీపీ సామ పద్మా వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.