బాల్కొండ: సీఎం కేసీఆర్ సరికొత్త నీలి విప్లవానికి నాందిపలికారని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో మత్స్యకారుల అభివృద్ధి జరిగిందని, సీఎం నిర్ణయంతో ప్రతి వృత్తిదారుని ఇంట్లో సంబురం నెలకొందని చెప్పారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని ఎస్సారెస్పీ బ్యాక్వాటర్ నాగపూర్ పాయింట్ వద్ద 62.86 లక్షల ఉచిత చేప పిల్లలను మంత్రి వదిలారు. అనంతరం మాట్లాడుతూ.. చేప పిల్లలు విడుదల చేసే క్రమంలో నూతనంగా చేపపిల్లలను లెక్కించే యత్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. దీంతో చేప పిల్లల విడుదలలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేదన్నారు.
ఏ దళారీ ప్రమేయం లేకుండా.. పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా చేప పిల్లల పంపిణీ జరుగుతుందని మంత్రి చెప్పారు. మత్స్యకారులనే ఇందులో భాగస్వామ్యం చేయడంతో వందల కోట్ల సంపద సృష్టి జరిగి వృత్తి దారుల కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాయని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంతో సంపద సృష్టి పట్ల దేశంలోని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ ఏడాది ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 1043 చెరువుల్లో 4.85 కోట్ల చేప పిల్లలు విడుదలకు ప్రణాళిక చేశామన్నారు. వీటి ద్వారా సుమారు రూ.500 కోట్ల సంపద సృష్టి జరగనుందని ఆశాభావం వ్యక్తంచేశారు.