Prashanth Reddy | హైదరాబాద్ : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్పై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా రాష్ట్ర కేబినెట్ సిఫారసు చేసిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను గవర్నర్ తిరస్కరించడం సరికాదన్నారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఉండి తమిళిసై గవర్నర్గా నామినేట్ అయ్యారని మంత్రి గుర్తు చేశారు. గవర్నర్గా తమిళిసైని నియమించడం కూడా సర్కారియా కమిషన్కు విరుద్ధమన్నారు. తమిళిసై గవర్నర్గా కొనసాగే నైతిక హక్కు లేదు. తక్షణమే గవర్నర్ పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నవారే అని మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.
మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా పంపాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జులై 31వ తేదీన ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీలు ఫారూక్ హుస్సేన్, రాజేశ్వరరావు పదవీకాలం ముగియడంతో వారి స్థానాల్లో దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా ప్రతిపాదిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది.
సంగారెడ్డికి చెందిన కుర్రా సత్యనారాయణ జనతాపార్టీ, బీజేపీలో పనిచేశారు. 1999లో టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగా సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సత్యనారాయణ 2018 వరకు బీజేపీలోనే ఉన్నారు. ఆ పార్టీ తెలంగాణ వ్యతిరేక వైఖరికి నిరసనగా రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ దాసోజు శ్రవణ్ బీసీ వర్గాల బలమైన గొంతుకగా ఎదిగారు. ప్రజారాజ్యంలో కొంతకాలంపాటు పనిచేసిన ఆయన ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి పలు హోదాల్లో పనిచేశారు. తెలంగాణ కోసం కేంద్రం నియమించిన శ్రీకృష్ణ కమిటీకి బీఆర్ఎస్ సమర్పించిన చారిత్రక నివేదిక రూపకల్పన బృందంలో సభ్యుడిగా పనిచేశారు.