బాల్కొండ : టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ 14 సంవత్సరాల పాటు అనేక ఉద్యమాలు చేసి తెలంగాణను సాధించారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణను అన్ని రంగాల్లో నంబర్ వన్గా నిలిపారని తెలిపారు. ఒక వేళ ఈ రాష్ట్రంలో కేసీఆర్ లేకుంటే తెలంగాణను ఉత్తరప్రదేశ్, బీహార్లా మారుస్తరని ప్రశాంత్ రెడ్డి అన్నారు. పచ్చబడుతున్న తెలంగాణను ఆగం చేసేందుకు కొందరు కుట్ర చేస్తున్నారు. దాన్నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఏనాటికైనా కేసీఆర్ మాత్రమే తెలంగాణకు శ్రీరామరక్ష అని ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని బాల్కొండ, బోదేపల్లి, జలాల్ పూర్, కిసాన్ నగర్ గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సుమారు 500 మంది ముఖ్య నాయకులు, కార్యకర్తలు, యువకులు.. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ జనరంజక పాలనకు ఆకర్షితులై ఇంత పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ ఏదైనా పిలుపిస్తే వెంటనే పాటించే నిఖార్సైన కార్యకర్తలు నియోజకవర్గంలో ఉన్నారని తెలిపారు.
ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో కరెంట్ కోతలు ఉన్నాయన్నారు. తెలంగాణలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. గతంలో సాగు, తాగునీటికి ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. బాల్కొండ, చిట్టాపుర్, శ్రీరాంపూర్ గ్రామాలకు 50 కోట్లతో లిఫ్ట్ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. వారం పది రోజుల్లో శంకుస్థాపన చేస్తామని మంత్రి ప్రకటించారు. రూ. 100 కోట్లతో కప్పలవాగు, పెద్దవాగు మీద చెక్ డ్యామ్లు నిర్మించామని మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పారు.