కమ్మర్పల్లి, సెప్టెంబర్ 22: కాంగ్రెస్కే గ్యారంటీ లేదు.. ఆ పార్టీ ఇస్తున్న ఆరు పథకాల హామీలకు గ్యారంటీ ఎక్కడుంటుదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రశ్నించారు. ఓట్ల కోసమే సాధ్యం కాని హామీలు ఇస్తున్నదని దుయ్యబట్టారు. వారు అధికారంలో ఉన్న కర్ణాటక తదితర రాష్ర్టాల్లో కేవలం రూ.750 పింఛన్ మాత్రమే ఇస్తున్న కాంగ్రెస్.. తెలంగాణలో మాత్రం రూ.4 వేల పింఛన్ ఇస్తామనడం ఎన్నికల వేళ మాయమాటలు చెప్పడమేనని ఎండగట్టారు. కాంగ్రె స్ పెట్టిన గోసలు.. బీజేపీ చేసిన మోసాన్ని ప్రజలు మర్చిపోలేరని అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం కోనాసముందర్, నర్సాపూర్, అమీర్నగర్, ఇనాయత్ నగర్లో రూ.10 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ కర్ణాటకలో రూ.4 వేలు ఇవ్వని కాంగ్రెస్.. తెలంగాణలో ఇస్తామనడం.. అక్కడ రైతుకు ఏ ఒక్క సాయం చేయని కాంగ్రెస్.. తెలంగాణలో రూ.15 వేలు ఇస్తామనడం ముమ్మాటికి మోసపూరిత హామీలేనని విమర్శించారు. కాంగ్రెస్ పాలిత నాలుగు రాష్ర్టాల్లో తెలంగాణలాగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, అమ్మఒడి, రైతుబంధు, రైతుబీమా ఎందుకు లేవని ప్రశ్నించారు. కాంగ్రెస్ది దింపుడు కల్లం ఆశలని, వారి పాచికలు తెలంగాణ ప్రజల వద్ద పారవని అన్నారు. రూ.200 ఉన్న పింఛన్ను రూ.వెయ్యికి, ఆ తరువాత రూ.2 వేలకు పెంచి ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని ఆయన కొనియాడారు. కేసీఆర్ పింఛన్దారులకు మరింత మంచి చేయబోతున్నారని తెలిపారు. రూ.19 వేల కోట్ల రుణ మాఫీ చేసిన మొనగాడు కేసీఆర్ అని అభివర్ణించారు. ఇంత పెద్ద రైతు రుణమాఫీ ప్రపంచంలో ఎక్కడా జరగలేదని చెప్పారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు రూ.36 వేల కోట్ల రుణ మాఫీ జరిగిందని గుర్తుచేశారు.