నల్లగొండ : మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కదని మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలువబోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి రెండోస్థానం దక్కే అవకాశం ఉందని మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.చౌటుప్పల్ మండలం డీ నాగరామ్ గ్రామంలో యువజన సభ్యులు నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్కు ముఖ్య అతిథిగా మంత్రి ప్రశాంత్ రెడ్డి హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డి స్వలాభం కోసమే అమ్ముడుపోయి, ఈ ఉప ఎన్నిక తీసుకొచ్చాడని ధ్వజమెత్తారు. మునుగోడు ప్రజలు ఆయనకు తప్పకుండా బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయి. అందుకే ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ పార్టీలో చేరి, కేసీఆర్కు అండగా నిలుస్తున్నారని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ సర్పంచ్లకు రూ. లక్షలు ఇచ్చి కొనుగోలు చేశారని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు.