నిజామాబాద్ : కొత్తగా తెచ్చుకున్న తెలంగాణాను అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో కేంద్రంతో మొదటి నుంచి సమన్వయంతోనే ఉన్నాం. కానీ కేంద్రం తెలంగాణకు నిధులు ఇవ్వడంలో వివక్ష చూపడంతో పాటు కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్రపూరితంగా వ్యవహరించింది.. ఇక ఊరుకునేది లేదు ఆట మొదలయ్యిందని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తిమ్మాపూర్, ఏర్గట్ల మండలం తొర్తి, కమ్మర్పల్లి మండలం ఆర్ఆర్ నగర్, ఉప్లూర్ గ్రామాల్లో రోడ్ల పనులతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చలేమన్న సంగతి కేంద్రానికి తెలిసిపోయిందన్నారు. అదికాక మునుగోడు ఎమ్మెల్యే రాజ్గోపాల్ రెడ్డిని అమిత్షా పిలిపించుకుని రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టు ఇస్తామని రాజీనామా చేయించి మరీ ఉప ఎన్నికలు తీసుకువచ్చారన్నారు. కేవలం బీజేపీ స్వార్ధ ప్రయోజనాల కోసం ఉప ఎన్నికను తీసుకువచ్చి రూ.5 వేల కోట్లు ఖర్చు చేసినా.. మునుగోడు ప్రజలు తెలంగాణ పక్షాన నిలబడి తెలంగాణ ప్రజల మనోభావాలను తెలియజేశారన్నారు. డబ్బుతో టీఆర్ఎస్ను ఓడించి రాష్ట్రంలో ఏవేవో డ్రామాలు చేయాలని చూశారు. కానీ మునుగోడు ప్రజలు దాన్ని గుర్తించి తెలంగాణ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారన్నారు. ఇప్పటికైన ప్రజలు మేల్కొనాలని పిలుపునిచ్చారు.
కేవలం కుల, మత చిచ్చు రగల్చడం వల్ల ఎవరికి ప్రయోజనమో ఆలోచించాలని సూచించారు. మనకు అభివృద్ధి ఎవరు చేస్తున్నారు, చిచ్చు పెడుతున్నది ఎవరు ఆన్న విషయాన్ని గమనించాలని కోరారు. మునుగోడుకు కిషన్రెడ్డి, బండి సంజయ్, జిల్లాకు చెందిన నేత ఒకరు వచ్చి ఇష్టమచ్చినట్లు అబద్దాలు మాట్లాడారని.. మొదటి నుంచి అబద్ధాలు మాట్లాడుతూనే ఉన్నారు.. ఇకముందు కూడా మాట్లాడుతూనే ఉంటారన్నారు. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కేసీఆర్ సహకారంతో బాల్కొండ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసుకుంటున్నామన్నారు.