హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అమరవీరుల భవనం పనులను నిర్ణీత సమయంలోగా పూర్తిచేసేలా పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశించారు. హుస్సేన్సాగర్ ఒడ్డున అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్మారక భవనం నిర్మాణ పనులను బుధవారం సాయంత్రం అధికారులతో కలిసి ఆకస్మికంగా పరిశీలించారు. నిర్మాణ ప్రాంగణమంతా సుమారు నాలుగు గంటలపాటు పరిశీలించారు.
అధికారులకు, వర్క్ ఏజెన్సీలకు పలు సూచనలు చేశారు. స్టెయిన్లెస్ స్టీల్ షీట్స్ బిగింపు తుదిదశ పనులు పరిశీలించారు. మెయిన్ ఎంట్రెన్స్, ఫ్లోరింగ్ పనులు, ఫౌంటెన్ ఏరియా, తెలంగాణ తల్లి విగ్రహ నిర్మాణం, ల్యాండ్స్కేప్ ఏరియా, మ్యూజియం, ఫొటో గ్యాలరీ, ఆడిటోరియంపై అంతస్తులో నిర్మించే రెస్టారెంట్ నిర్మాణ పనులను పరిశీలించారు. కూలీలను పెంచి మూడు షిప్టుల్లో పనులు జరిపించాలని, నిర్మాణ తుది పనుల్లో ఇంకా వేగం పెంచాలని సూచించారు. సీఎం కేసీఆర్ విధించిన నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తి కావాలని అధికారులకు, వర్క్ ఏజెన్సీలకు ఆదేశించారు. మంత్రి వెంట ఆర్అండ్బీ అధికారులు, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు, ఆర్కిటెక్ట్ ఉన్నారు.