హుస్నాబాద్, డిసెంబర్ 12: కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి హుస్నాబాద్లో కేంద్రీయ విద్యాలయాన్ని( Kendriya vidhylayam) ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar,) హామీ ఇచ్చారు. మంగళవారం హుస్నాబాద్ మున్సిపల్ సమావేశ మందిరంలో మంత్రికి పౌరసన్మానం జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితతో పాటు పాలకవర్గం మంత్రికి ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హుస్నాబాద్ పట్టణానికి చుట్టూ 40కిలోమీటర్ల వరకు పెద్ద పట్టణం లేదని, హుస్నాబాద్ పట్టణాన్ని నగరంగా తయారు చేసి ఈ ప్రాంత ప్రజలు గర్వంగా చెప్పుకునే విధంగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. హుస్నాబాద్కు మెడికల్ కాలేజీ మంజూరు ఖాయమని, ఇందుకోసం స్థల పరిశీలన చేయాల్సిందిగా రెవెన్యూ అధికారులను ఆదేశించామని తెలిపారు. ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలని, అనంతరం అభివృద్ధి ఎజెండాగా పనిచేయాలని సూచించారు.
అనంతరం హుస్నాబాద్లోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. అక్కడ వాసవీ సేవా సమితి వారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం దవాఖాన లోపలికి వెళ్లి రోగులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరాతీశారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, వైస్చైర్పర్సన్ అయిలేని అనితారెడ్డి, కమిషనర్ రాజశేఖర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.