హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): క్లీన్ లాస్ట్-మైల్ మొబిలిటీకి తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఇస్తుందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. ఎలక్ట్రిక్, గ్యాస్ ఆధారిత ఆటోరిక్షాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. మంగళవారం హెచ్ఐసీసీ నోవొటెల్లో సెకండ్ నేషనల్ మొబిలిటీ సమ్మిట్-2026 ను మంత్రి ప్రారంభించి మాట్లాడారు.
తెలంగాణలో 20,000 కొత్త ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ఆటోరిక్షాలకు తమ ప్రభుత్వం అనుమతించిందని తెలిపారు. 10 వేల కొత్త సీఎన్జీ త్రీ-వీలర్ పర్మిట్లను, 10వేల కొత్త ఎల్పీజీ త్రీ-వీలర్ పర్మిట్లను కూడా ఆమోదించిందని పేర్కొన్నారు. వీటితోపాటు అదనంగా ఇప్పటికే ఉన్న ఆటోరిక్షాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడానికి మరో 20వేల పర్మిట్లు అనుమతించామని చెప్పారు. 2026 చివరికిఎలక్ట్రిక్ వాహనాలకు 100% రోడ్డు పన్ను మాఫీ చేస్తున్నామని తెలిపారు.