రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి తెరపడింది. నేతన్నల పక్షాన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన హెచ్చరిక, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాసిన లేఖ సానుకూల ఫలితాన్నిచ్చింది. నేత కార్మికులకు చేతినిండి పని కల్పించి అన్ని విధాలుగా ఆదుకుంటామని రా ష్ట్ర ప్రభుత్వం హామీనిచ్చింది. బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం సిరిసిల్లకు చేరుకొని, కార్మిక సంఘాల నాయకులు, వస్త్ర ఉత్పత్తిదారులు, ఆసాముల జేఏసీతో జరిపిన చర్చలు ఫలించాయి. పరిశ్రమకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలు దశలవారీగా విడుదల చేస్తామని, నేతన్నలకు మెరుగైన ఉపాధి కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పొన్నం చెప్పడంతో పరిశ్రమను పునఃప్రారంభించేందుకు యజమానులు ముందుకొచ్చారు. సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పొన్నం మీడియాతో మాట్లాడారు. పెండింగ్ బకాయిలను పూర్తిస్థాయిలో దశలవారీగా ఇస్తామని చెప్పారు. నేతన్నలకు మెరుగైన ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సాంచాలకున్న విద్యుత్తు బకాయిలపై సెస్ అధికారులు ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. ఆ తర్వాత వస్త్ర వ్యాపార సంఘ భవనంలో కా ర్మిక సంఘాల నాయకులు, వస్త్ర ఉత్పత్తి దారులతో ఏర్పడ్డ జేఏసీ నాయకులతో మంత్రి చర్చ లు జరిపారు. జేఏసీ పెట్టిన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరిస్తుందని, మరమగ్గాలు ప్రారంభించి కార్మికులకు ఉపాధి కల్పించాలని సూచించారు. అందుకు సమ్మతించిన జేఏసీ నేతలు బుధవారం నుంచి వస్త్ర పరిశ్రమను పునఃప్రారంభించనున్నట్టు ప్రకటించారు.
రేపటి నుంచి పరిశ్రమ ప్రారంభం
బీఆర్ఎస్ అధినేత చేసిన హెచ్చరికలతో దిగివచ్చిన సర్కారు వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్ను సిరిసిల్లకు పంపించింది. ఆ మేర కు మంత్రి పొన్నం, విప్ ఆది శ్రీనివాస్ సోమవారం వస్త్ర వ్యాపారసంఘ భవనంలో కార్మిక సంఘాల నాయకులు, వస్త్ర ఉత్పత్తిదారులు, ఆసాములతో గంటపాటు చర్చలు జరిపారు. నే తన్నలకు మెరుగైన ఉపాధి కల్పించి, బకాయిలు విడుదల చేస్తామని చెప్పడంతో జేఏసీ నాయకులు అంగీకరించారు. ఈ విషయాన్ని కార్మిక సంఘాలు నాయకుల, వస్త్ర ఉత్పత్తిదారులు, ఆసాములు జేఏసీ నాయకులు పంతం రవి, మూషం రమేశ్, మండల సత్యం వెల్లడించారు. బుధవారం నుంచి సాంచాలను నడిపిస్తామని చెప్పారు. నేత కార్మికులు హర్షం వ్య క్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు
కృతజ్ఞతలు తెలిపారు.
ఏ ముఖం పెట్టుకుని దీక్ష చేస్తావ్?
సిరిసిల్లకు పవర్లూం క్లస్టర్ అడిగితే నోరెత్తని ఎంపీ బండి సంజయ్.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఈ నెల 10న దీక్ష చేస్తానంటున్నావని బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించా రు. శవాల మీద రాజకీయం చేయవద్దని హితవు పలికారు. ఐదేండ్లలో కేంద్రం నుంచి ఒక్క రూపాయి అయి నా తెచ్చావా? అంటూ నిలదీశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం విప్ ఆది శ్రీనివాస్, నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డిలతో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సిరిసిల్ల నేత కార్మికులకు ఎలాంటి కష్టం రా కుండా ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. వస్త్ర పరిశ్రమ సం క్షోభంపై సీఎం రేవంత్రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో చర్చించామని, దశలవారీగా బకాయిలు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఆర్వీఎం ఆర్డర్లు ఇచ్చి రూ.180 కోట్లు విడుదల
చేసినట్టు తెలిపారు.