వరంగల్, జనవరి 20 (నమస్తే తెలంగాణప్రతినిధి): కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు, అధికారుల తీరుపై సొంతపార్టీ ఎమ్మెల్యేలే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. యాసంగి పంటలకు సాగునీరు ఇవ్వకుంటే రైతులు ఉరికిస్తారని హెచ్చరించారు. హనుమకొండ కలెక్టరేట్లో శనివారం వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల సమీక్ష సమావేశం జరిగింది. మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్తో కలిసి వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు.
ఎమ్మెల్యేలు, ఆరు జిల్లాల కలెక్టర్లతో పాటు అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పోలీసు పహారా మధ్య జరిగిన ఈ సమావేశానికి మీడియాను అనుమతించ లేదు. పలువురు ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో కొన్ని అంశాలపై ఉన్నదున్నట్లుగా మాట్లాడారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం భూపాలపల్లి, నర్సంపేట నియోజకవర్గాల్లో సాగునీటి సరఫరా అంశంపై ఈ సెగ్మెంట్ల ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, దొంతి మాధవరెడ్డి మంత్రుల ముందే అసంతృప్తి వ్యక్తం చేశారు.
నర్సంపేట నియోజకవర్గంలోని పాకాల ఆయకట్టుకు యాసంగిలో నీళ్లు ఇచ్చే విషయంలో స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యే దొంతి కోరారు. చెరువుల కింద ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించేలా భరోసా కల్పించాలని, అధికార యంత్రాంగం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. భూపాలపల్లి నియోజకవర్గంలోనూ సాగునీటి సరఫరాకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అసంతృప్తి వ్యక్తం చేశారు.
“గత జూలైలో వచ్చిన భారీ వర్షాలతో భూపాలపల్లి నియోజకవర్గంలో బాగా నష్టం జరిగింది. 70 చెరువులకు మరమ్మతులు అవసరం ఉన్నది. చెరువులకు మరమ్మతులు చేసి నీళ్లు ఇయ్యాలి. లేకుంటే రైతులు ఉరికిస్తరు. వరదలతో మోరంచపల్లి ఊరు మొత్తం మునిగిపోయింది. ఐదుగురు చనిపోయారు. అంతా కొట్టుకుపోయింది.
వరదలు వచ్చి ఇన్ని నెలలైనా ఆ ప్రాంతం వాళ్లకు ఎలాంటి సాయం అందించలేదు. మళ్లీ వానాకాలం వచ్చేటట్టు ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం తరపున ఏదో ఒకటి చేయాలి. గొర్లవీడు ఇందిరాసాగర్ ప్రాజెక్టును త్వరగా కట్టాలి. చెరువులను బాగు చేసి నీళ్లు నింపాలి” అని కోరారు. ఎండాకాలంలో తాగునీటి సరఫరా కోసం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
పోలీసు పహారా
మంత్రుల సమీక్ష సమావేశం సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టరేట్ మొత్తం పోలీసులతో నిండిపోయింది. ఆరు జిల్లాలకు చెందిన వందల మంది పోలీసులు హనుమకొండ కలెక్టరేట్లోనే ఉన్నారు. గతంలో ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు సైతం లేనంతమంది పోలీసులు మంత్రుల పర్యటనలో ఉండడంపై వరంగల్ నగర ప్రజలు చర్చించుకున్నారు. హైదరాబాద్ మార్గంలో వరంగల్ నగర శివారు నుంచి హనుమకొండ జిల్లా కలెక్టరేట్ వరకు అడుగడుగునా పోలీసులు ఉన్నారు.
సమీక్షలో కాంగ్రెస్ నేతలు
ప్రభుత్వపరంగా నలుగురు మంత్రులు నిర్వహించిన సమీక్ష సమావేశం ఎమ్మెల్యేలకు మాత్రమే అని చెప్పినా కాంగ్రెస్ నేతలు కూడా పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున పోటీచేసి ఓడిపోయిన కొమ్మూరి ప్రతాప్రెడ్డి, పాలకుర్తి కాంగ్రెస్ నాయకురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి సమీక్షలో పాల్గొన్నారు.
ఎమ్మెల్యేల ప్రతిపాదనలు పట్టించుకోని మంత్రులు
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అభివృద్ధిపై సమీక్షలో పలువురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు అవసరమైన పనుల మంజూరు చేయాలని కోరారు. ఎమ్మెల్యేల ప్రతిపాదనలను మంత్రులు పెద్దగా పట్టించుకోలేదు. కొత్త పనుల సంగతి ఇప్పుడు వద్దని, బడ్జెట్ తర్వాత చూద్దామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం మంజూరుచేసిన పనులలో 70 శాతం వరకు పూర్తయిన వాటిని మాత్రమే కొనసాగించాలని చెప్పారు. మిగిలిన అన్ని పనులను సమీక్షించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున నిధులు ఇస్తున్నదని, ప్రాధాన్యత ప్రాతిపదికన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.
ఎమ్మెల్సీలకు ఆహ్వానం లేదు
ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిపై నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఎమ్మెల్యేలను తప్ప ఎవరినీ ఆహ్వానించలేదు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, మేయర్, జిల్లా పరిషత్ చైర్పర్సన్లు, మున్సిపాలిటీ చైర్పర్సన్లను ఈ సమావేశానికి ఆహ్వానించకపోవడంపై అధికారుల్లోనూ చర్చ జరిగింది. ప్రభుత్వపరంగా జరిగిన సమావేశానికి ప్రజాప్రతినిధులను ఆహ్వానించకపోవడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమైంది.