హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలవల్ల 3,039 మందిని రక్షించగలిగామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వరద ప్రభావిత ప్రాంతాలల్లో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పంట నష్టం, ఆస్తి నష్టం వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలని సూచించారు.
ఇప్పటివరకు రాష్ట్రంలో 117 గ్రామాలలో 67 వేల మంది భారీ వర్షాలు, వరదల వల్ల ప్రభావితమయ్యారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 133 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి 10,538 మందిని తరలించామని తెలిపారు. 44 ఇండ్లు పూర్తిగా దెబ్బతినగా, వారికి కొత్త ఇండ్లు మంజూరు చేయాలని చెప్పారు. 600వరకు ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని, వాటికి మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. 51 బ్రిడ్జీలు, 249 కల్వర్టులు, 166 ట్యాంక్లు దెబ్బతిన్నాయని, 13,342 జీవాలు మృతి చెందాయని తెలిపారు.