హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గృహనిర్మాణ సంస్థలో అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర గృహనిర్మాణ, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం సచివాలయంలో మంత్రిని తెలంగాణ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ అసిస్టెంట్ ఇంజినీర్లు, వర్క్ ఇన్స్పెక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గవ్వ రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో మంత్రికి వినతిపత్రం అందజేశారు.
సంస్థ ఉద్యోగులు 2016 జూలై 14 నుంచి ప్రభుత్వంలోని 31 ఇతర శాఖల్లో పనిచేస్తున్నట్టు మంత్రికి వివరించారు. ఇతర శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులను మాతృ సంస్థలోకి తీసుకోవాలని కోరారు. మూడు దశాబ్దాలకు పైగా ఒకే క్యాటగిరీలో పనిజేస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్లకు అసిస్టెంట్ ఇంజినీర్లుగా పదోన్నతులు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి జీ రఘువీర్ ప్రసాద్గుప్తా, కోశాధికారి జేఆర్ఎస్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ బీ వెంకట్రామిరెడ్డి, ప్రతినిధులు ఎండీ ఫహీం అహ్మద్, డీ రవీందర్నాయక్, ఎస్ సంపత్కుమార్ తదితరులు పాల్గొన్నారు.