Ponguleti Srinivas Reddy | హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): రాబోయే సీజన్లో వ్యవసాయానికి నీళ్లు అందించడం కష్టమేనని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో నీటి కొరత ఉన్నదని, ప్రజలకు తాగునీరు అందించడానికే కష్టపడుతున్నామని చెప్పారు. గురువారం ఆయన హైదరాబాద్లో మీడియాతో చిట్చాట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. కర్ణాటకలోనూ కరువు నెలకొన్నదని, కాబట్టి ఆ రాష్ర్టాన్ని కూడా అడిగే పరిస్థితి లేదని స్పష్టంచేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు ఇస్తున్నప్పటికీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆలస్యం అవుతున్నదని, నెలల బకాయిలు ఉన్నాయని చెప్పారు. ఈ విషయంపై దృష్టిసారించామని తెలిపారు.
తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్ ట్యాపింగ్ చేయదని పేర్కొన్నారు. తాను కాంగ్రెస్లో సబ్ జూనియర్ అని, తనకు ముఖ్యమంత్రి పదవిపై ఆశ లేదని, సీఎం కావాలన్న ఆలోచన కూడా లేదని వ్యాఖ్యానించారు. సీఎంతో రోజూ కనిపించినంత మాత్రాన ప్రభుత్వంలో నంబర్ 2 అనడం సబబు కాదని చెప్పారు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని, అందరినీ కలుపుకొని పోతామని తెలిపారు. తమతో స్నేహం చేసేందుకు ఎంఐఎం ముందుకొస్తున్నదని వెల్లడించారు. తమ స్నేహం కొనసాగుతుందని, హైదరాబాద్లో నామమాత్రంగా అభ్యర్థిని నిలబెడతామని చెప్పారు.
ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి రమ్మని ఎవరినీ అడగడం లేదని, వారే స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని పేర్కొన్నారు. ధరణి పోర్టల్పై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని తెలిపారు. ధరణిలో మంచిని కొనసాగిస్తామని స్పష్టంచేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రంతో కొట్లాడుతూనే ఉంటామని పేర్కొన్నారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలపై కార్యాచరణ మొదలైందని చెప్పారు. ఎన్నికల కోడ్ ముగిసిన నెల రోజుల్లో జవహర్లాల్ నెహ్రూ సొసైటీ సభ్యులకు ప్లాట్లు అందజేస్తామని హామీ ఇచ్చారు.