హైదరాబాద్, ఏప్రిల్ 8(నమస్తే తెలంగాణ): తాను భూదందా చేస్తున్నట్టు మాజీ మంత్రి హరీశ్రావు చేసిన ఆరోపణలు, ‘నమస్తే తెలంగాణ’ కథనాలపై సుమారు గంటపాటు వివరణ ఇచ్చుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆ తర్వాత మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే పరారయ్యారు. గంట పాటు పెద్ద పెద్ద ఫొటోలు, తనకు అనుకూలంగా ఉన్న డాక్యుమెంట్లను చూపిస్తూ గొంతు చించుకున్నారు. కేరళ నుంచి మొదలుకొని నాదర్గుల్ 373 ఎకరాల భూబాగోతం, కొత్వాల్గూడ క్రషర్ అవినీతి, వట్టినాగులపల్లిలో తన కుమారుడు హర్షారెడ్డి భూ ఆక్రమణలు, బెదిరింపులపై సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. అయితే ఆ తర్వాత ప్రశ్నలు అడిగేందుకు మీడియాకు కనీసం పది నిమిషాలు కూడా సమయం ఇవ్వలేదు.
ఒకరిద్దరు రెండు మూడు ప్రశ్నలు అడగ్గానే ఆయన మైక్ ఆఫ్ చేసి లేచి వెళ్లిపోయారు. దీంతో అక్కడున్న విలేకరులంతా మంత్రి తీరుపై అసహనం వ్యక్తంచేశారు. తనకు అనుకూలమైన వాదనలు వినిపించి పోవడానికైతే విలేకరుల సమావేశం ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తున్నారు. నిజంగానే ఆయన తప్పు చేయకుంటే, ప్రతిపక్షాల ఆరోపణలపై ఆయన వద్ద అన్ని ఆధారాలూ ఉండి ఉంటే మీడియా ప్రశ్నలను ఎదుర్కోకుండా ఎందుకు తప్పించుకున్నారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా ప్రశ్నలు అడిగే విలేకరులపై మంత్రి బీఆర్ఎస్ ముద్ర వేయడం గమనార్హం. సబ్జెక్టు, సమాధానం చెప్పకుండా తప్పించుకొనే ప్రయత్నం చేశారు.